Skip to main content

సింధు లోయ నాగరికత

వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు
సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.
ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలవబడుతున్నది. కానీ భాష మరియు ప్రాంతీయతల ఆధారంగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ మరియు మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది. 400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి.
క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి.

చారిత్రక సమకాలీనత

సుమేరియన్ నాగరికత క్రీ.పూ. 6000 నుండి క్రీ.పూ. 2000 వరకు వర్ధిల్లింది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో వారు అక్షరాల వ్రాతకు అభివృద్ధి చేసినట్లనిపిస్తుంది. ఆ వ్రాతల రికార్డుల ప్రకారం వారు "మాగన్", "దిల్మన్", "మెలూహా" - అనే మూడు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. వీటిలో మాగన్ అనేది ఈజిప్టు ప్రాంతమని, దిల్మన్ అనేది బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ ప్రాంతమని చరిత్రకారులు అభిప్రాయం. మూడవది అయిన మెలూహా గురించి ఏకాభిప్రాయం లేదు. ఇది సింధు లోయ నాగరికతను సూచించే ప్రదేశమని ఒక బలమైన అభిప్రాయం ఉంది. "మే-లాహ్-హా" అనే సుమేరియన్ పదానికి, "మెటకమ్" (ఉన్నత స్థానం) అనే ద్రవిడ పదానికి, "మ్లేచ్ఛ" అనే సంస్కృత పదానికి, "మలాహా" (నావికుడు) అనే ఉర్ధు పదానికి సంబంధం ఉన్నదని ఒక అభిప్రాయం. ఇలా చూస్తే ఈ "మెలూహా" అనేది సింధునదీలోయలో వర్ధిల్లిన నాగరికతతో వారికున్న సంబంధాలను బట్టి సుమేరియన్ నాగరికత, సింధు లోయ నాగరికత ఒకే కాలానికి చెందినవి కావచ్చును. అయితే సింధు లోయ నాగరికత అంతమైన తరువాత "మెలూహా" అనే పదం వాడకం కొనసాగింది. ఆ తరువాతి సమయంలో అది ఈజిప్టు, ఆఫ్రికా ప్రాంతాలను సూచించినట్లు అనిపిస్తున్నది.
ఏలం అనే నాగరికత క్రీ.పూ. 2700 కాలంలో ప్రస్తుత ఇరాన్ నైఋతి భాగంలో వర్ధిల్లింది. ఇది ఇతర నాగరికతలో సంబంధం లేనిదని ఒక అభిప్రాయం. మరొక ప్రతిపాదన ప్రకారం ఏలం-ద్రవిడ నాగరికత అనే విస్తృత నాగరికతలో "ఏలం" నాగరికత ఒక భాగం. ఆ విషయంలో సింధు లోయ నాగరికతను ఏలం నాగరికతతో పోల్చి పరిశీలిస్తున్నారు. (మాతృ) దేవతారాధన మరియు "ఎద్దులతో క్రీడలు" అనే అంశాలలో సారూప్యత పరంగా మినోవన్ క్రీటె నాగరికతతో కూడా సింధు లోయ నాగరికతను పోలుస్తున్నారు.
సింధూనదీలోయ నాగరికతలో అభివృద్ధి చెందిన హరప్పా నాగరికత దశ పురాతన సమీప ప్రాచ్యప్రపంచం కంచుయుగం ఆరంభ దశ నుండి కంచుయుగం మధ్యదశ వరకు సమకాలీనమైన నాగరికతగా అంచనా వేయవచ్చును. దీనికి సమకాలీనమైన నాగరికతలుగా భావించ బడుతున్న ఇతర నాగరికతలు
సింధులోయ నాగరికతలో వాడిన భాషను మాత్రం ఇప్పటిదాకా ధృవీకరించలేకుండా ఉన్నారు. ఆది ద్రవిడ భాష,ఆది ఇండో ఇరానియన్, ముండా భాష, ఇంకా పురాతన నిహాలీ భాష సంబంధించిన కొన్ని పదాలను వీరు వాడి ఉండవచ్చునని భావిస్తున్నారు.

త్రవ్వకాలు

హరప్పా శిథిలాలను గురించి 1842లో మొట్టమొదటగా ఛార్లెస్ మాసన్ అనే యాత్రికుడు బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్‌లలో పర్యటించి అక్కడి స్థానికుల నుంచి సుమారు 13 కోసులు ( 25 మైళ్ళ) దూరం విస్తరించిన ఒక నగరాన్ని గురించి చెప్పారని తన రచనల్లో వర్ణించాడు. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులెవరూ దీనిని ఒక శతాబ్ద కాలంపాటు పట్టించుకోలేదు. 1856లో బ్రిటీష్ ఇంజనీర్లైన జాన్ మరియు విలియం బ్రంటన్ ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ కోసం కరాచీ నుంచి లాహోర్ వరకు పట్టాలు వేస్తున్నారు. జాన్ రైలు మార్గానికి కావల్సిన కంకర కోసం వెతుకుతున్నాడు. ఆ ప్రదేశానికి దగ్గరలో గల కొంత మంది ప్రాంతీయులు శిథిలావస్థలో ఉన్న బ్రహ్మినాబాద్ అనే నగరాన్ని గురించి చెప్పారు. దాన్ని సందర్శించిన జాన్ అందులో బాగా కాలిన దృఢమైన ఇటుకలు కనిపించాయి. రైలు మార్గం వేయడం కోసం కంకర కోసం వచ్చిన వాళ్ళకు శిథిలమైన ఆ నగరంపైనే రైలు మార్గంగా వేయడానికి అనుకూలంగా తోచింది. కొద్ది నెలల తర్వాత ఇంకా ఉత్తరంగా జాన్ సోదరుడైన విలియం బ్రంటన్ వేయవల్సిన రైలు మార్గానికి దగ్గరలో ఇంకొక శిథిలమైన నగరం కనిపించింది. అందులోనుంచి ఇటుకలను తీసి చుట్టుపక్కల గ్రామస్తులు కొద్దిమంది తమ అవసరాలకు వాడుకుని ఉన్నారు. ఆ ఇటుకలే ఇప్పుడు కరాచీ, లాహోర్ రైలు మార్గానికి ballast గా ఉపయోగపడ్డాయి.
1872-75 మద్య కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ మొదటి సారిగా హరప్పా కు సంబంధించిన ముద్రలను ప్రచురించాడు. అయితే వీటిలో లిపిని బ్రాహ్మీ లిపి అక్షరాలు అని (తప్పుగా) భావించాడు.అర్ధ శతాబ్దం తర్వాత 1912లో జె. ఫ్లీట్ మరికొన్ని హరప్పా ముద్రలను కనుగొన్నాడు. దీన్ని కనుగొన్న ప్రోత్సాహంతో జాన్ మార్షల్ నేతృత్వంలో 1921-22 లో రాయ్ బహదూర్ దయారామ్ సానీ, మాధో సరూప్ వ్యాట్స్ మొదలైన వారు అప్పటి దాకా కనుగొనబడని హరప్పా శిథిలాలను కనుగొన్నారు. అలాగే రాఖల్ దాస్ బెనర్జీ, ఇ.జె.హెచ్ మాకే మరియు జాన్ మార్షల్ మొహంజొదారో శిథిలాలను కనుగొన్నారు. 1931 వచ్చేసరికి చాలావరకు మొహంజోదారో శిథిలాలను వెలికి తీయగలిగారు. కానీ భారతీయ పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో త్రవ్వకాలు మాత్రం కొనసాగాయి. స్వాతంత్ర్యానికి ముందు (1947 కు ముందు) ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో అహ్మద్ హసన్ దనీ, బ్రిజ్ బసీ లాల్, నాని గోపాల్ మజుందార్, సర్ మార్క్ ఔరెల్ స్టీన్ మొదలైన వారు ప్రముఖులు.
స్వాతంత్ర్యానంతరం భారతదేశ విభజన తర్వాత పురాతత్వ శాఖ కనుగొన్న చాలా వస్తువులు అవి కనుగొన్న చోటు ఎక్కువ భాగం పాకిస్థాన్ లో ఉండడం మూలాన పాకిస్తాన్‌కు వారసత్వంగా వెళ్ళి పోయాయి. తర్వాత కూడా పాకిస్థాన్ పురాతత్వ శాఖకు సలహాదారు ఐన సర్ మోర్టిమర్ వీలర్ ఆధ్వర్యంలో 1949లో జరపబడ్డాయి. ఈ నాగరికతకు సంబందించిన త్రవ్వకాలు పడమర వైపున బెలూచిస్థాన్ లోగల సుత్కాగన్ దర్ వరకు, ఉత్తరం వైపున ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోగల "అముదార్య" లేదా "ఆక్సస్" నది వరకు జరుపబడ్డాయి.

యుగ విభజన

హరప్పా నాగరికత పరిణత దశ క్రీ.పూ. 2600 నుండి క్రీ.పూ. 1900 వరకు కొనసాగింది. ఇంతకు ముందు దశను ఆరంభ హరప్పా దశ అని, తరువాతి దశను అనంతర హరప్పా దశ అని అంటారు. ఇవన్నీ కలిపి చూస్తే సింధు లోయ నాగరికత క్రీ.పూ. 33వ శతాబ్దం నుండి క్రీ.పూ. 14వ శతాబ్దం (అనగా షుమారు 2000 సంవత్సరాలు) కొనసాగిందని చెప్పవచ్చును. సింధులోయ నాగరికతను కాలమానం ప్రకారం విభజించడానికి "దశలు" మరియు "యుగాలు (Eras) అనే రెండు పదాలను వాడుతున్నారు.
  • మొదటిదైన ఆరంభ హరప్పా దశ - దీనినే యుగం "ప్రాంతీకరణ యుగం" అని కూడా అంటారు. ఇది క్రొత్త రాతి యుగపు రెండవ "మెహ్రగర్" కాలానికి సరిపోతుంది. మెహ్రగర్‌లో లభించిన అవశేషాలు సింధు లోయ నాగరికత పట్ల అవగాహనలో క్రొత్త వెలుగులకు దారి తీశాయని ఇస్లామాబాద్ ఆచార్యుడు "అహమ్మద్ హసన్ దని" అన్నాడు. 
  • రెండవదైన పరిణత హరప్పా దశ - దీనినే యుగం "సమైక్యతా యుగం" అని కూడా అంటారు.
  • చివరిదైన అనంతర హరప్పా దశ - దీనినే యుగం "స్థానికీకరణ యుగం" అని కూడా అంటారు.
కాల ప్రమాణం (క్రీస్తు పూర్వం) దశ యుగం
5500-3300 మెహ్రగర్ II-VI (క్రొత్త రాతియుగపు పాత్రల కాలం) ప్రాంతీకరణ యుగం
3300-2600 ఆరంభ హరప్పన్ (ఆరంభ కంచు యుగం)
3300-2800 హరప్పన్ 1 (రావి దశ)
2800-2600 హరప్పన్ 2 (కోట్ దిజి దశ, నౌషారో I, మెహ్రగర్ VII)
2600-1900 పరిణత హరప్పన్ (మధ్య కంచు యుగం) సమైక్యతా యుగం
2600-2450 హరప్పన్ 3A (నౌషారో II)
2450-2200 హరప్పన్ 3B
2200-1900 హరప్పన్ 3C
1900-1300 అనంతర హరప్పన్ (సమాధుల కాలం, చివరి కంచు యుగం) స్థానికీకరణ యుగం
1900-1700 హరప్పన్ 4
1700-1300 హరప్పన్ 5

భౌగోళిక విస్తరణ

సింధులోయ నాగరికత విస్తరించిన ప్రాంత మరియు ముఖ్య శిధిలావశేషాలను చూపే మ్యాప్ - ఇటీవల కనుగొన్న రూపార్, బాలాకోట్, షార్టుఘాయి (ఆఫ్ఘనిస్తాన్), మండా (జమ్ము) వంటివి ఈ ఈ చిత్రంలోని ఆకుపచ్చ రంగు ప్రాంతం వెలుపల ఉన్నాయి. మరింత వివరణాత్మకమైన మ్యాప్ కోసం చూడండి .
సింధు లోయ నాగరికత ఎక్కువగా పాకిస్థాన్ భూభాగమైన బెలూచిస్తాన్ నుంచి సింధ్ వరకు, జీలం నదికి తూర్పుగా ఉన్న పంజాబ్ నుంచి సట్లెజ్ నదికి ఎగువన ఉన్న రూపార్ వంటి ప్రదేశాల్లో విలసిల్లింది. ఇటీవలే సింధూ నాగరికతకు సంభందించిన కొన్ని ప్రదేశాలు వాయువ్య పాకిస్థాన్‌లో కూడా బయల్పడినాయి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, గుజరాత్ లలో కూడా ఈ నాగరికతకు సంభందించిన చిన్న చిన్న కాలనీలను కనుగొన్నారు. తీర ప్రాంతాలు పశ్చిమ బెలూచిస్తాన్ లోని సుట్కాగన్ దర్ నుంచి గుజరాత్ లోగల లోథాల్వరకు వ్యాపించి ఉండేవి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ఆక్సస్ నది తీరాన షార్టుఘాయివద్ద కూడా సింధు లోయ నాగరికత స్థలాన్ని కనుగొన్నారు.. పాకిస్తాన్ వాయువ్య భాగంలో గోమల్ నది పరిసరాలలో మరొక స్థలం కనిపించింది.భారతదేశంలో ఇంకొక స్థలం జమ్ములో బియాస్ నది తీరాన ఉంది.మరియు హిందన్ నది వడ్డున ఆలంగీర్‌పూర్ వద్ద (ఢిల్లీకి 28 కి.మీ. దూరంలోనే) కనుగొన్నారు. అధికంగా సింధులోయ నాగరికత స్థలాలు నదీ తీరాలలో కనిపించాయి. కొన్ని సముద్ర తీరాన కూడా ఉన్నాయి. ఉదాహరణకు బాలాకోట్. కొన్ని దీవులలో కూడా - ఉదాహరణకు ధోలావిరా.
పాకిస్తాన్‌లో హక్రా ప్రవాహం మధ్య ఎండిపోయిన నది దిబ్బలు మరియు భారతదేశంలో వర్షాలు పడినప్పుడు ప్రవహించే ఘగ్గర్ నది ప్రాంతాలలో అనేక "సింధులోయ" లేదా "హరప్పా" నాగరికతకు చెందిన శిధిలావశేష స్థలాలను కనుగొన్నారు. - రూపార్, సోతి, రాఖీగరి, కాలిబంగన్, గన్వారివాలా వాటిలో కొన్ని స్థలాలు. పాకిస్తాన్ మరియు భారతదేశపు సరిహద్దులలో "ఘగ్గర్ - హక్రా" ప్రాంతంలో విస్తరించి ఉన్న బాగొర్, హక్రా, కోటి దిజ్ వంటి జాతుల నాగరికత సంకీర్ణమే ఈ హరప్పా నాగరికత అని జె జి షాపెర్ మరియు డిఎ లీచెన్స్టీన్ అభిప్రాయపడ్డారు.కొద్ది మంది పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం ఎండిపోయిన ఘగ్గర్ హక్రా నది మరియు ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో దాదాపు 500 హరప్పా ప్రదేశాలు బయల్పడినాయి.సింధూ మరియు దాని ఉపనదుల తీరం వెంబడి కేవలం 100 ప్రదేశాలు మాత్రమే కనుగొనబడ్డాయి గనుక ఈ నాగరికతను "సింధు-ఘగ్గర్-హక్రా నాగరికత" లేదా "సింధు-సరస్వతి నాగరికత" అని పిలవాలని కొంతమంది పురాతన చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భావాలలో కొన్ని రాజకీయ ఛాయలు కూడా ఉన్నాయి. ఈ విధమైన నామకరణం అనవుసరమని, అశాస్త్రీయం కూడానని ఇతర పురాతన చరిత్ర పరిశోధకులు అంటున్నారు. ఒక కారణం: ఘగ్గర్-హక్రా ప్రాంతం ఎడారిమయమైనందున అక్కడి స్థలాలు చెదరకుండా నిలిచాయి. జనసమ్మర్దం ఉన్న సింధులోయలో జనావాసాల వలన, వ్యవసాయం వలన, మెత్తని మన్నువలన చారిత్రిక అవశేషాలు నాశనమైపోయాయి. మరొకటి: ఘగ్గర్-హక్రా ప్రాంతంలో లభించిన శిధిలావశేషాలు అతిశయంగా చెబుతున్నారు. అంతే కాక ఒకవాడు ఘగ్గర్, హక్రానదులు సిధు నదికి ఉపనదులు. కనుక "సింధు లోయ నాగరికత" అనే పదం మొత్తానికి వర్తిస్తుంది.  పురాతన శిధిలాల త్రవ్వకాలలో మొదట కనుగొన్న స్థలం పేరుమీద ఆ నాగరికతకు ఆ పేరు పెట్టడం సామాన్యం కనుక "హరప్పా నాగరికత" అనేది సముచితమైన పేరు.
సింధులోయ నాగరికతకు దక్షిణ భారత దేశంతో ఉన్న సంబంధాలు తెలిపే అవశేషాలు తాజాగా బయల్పడ్డా యి. కేరళలోని వాయనాడ్ జిల్లా ఎడక్కల్ గుహల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన రాతి నగిషీలు లభించాయి. కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ సింధులోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఎప్పుడో దొరికాయి. అయి తే. కేరళలో కొత్తగా లభించిన అవశేషాలతో హరప్పా నాగరికత దక్షిణ భారత దేశంలోనూ విలసిల్లిందని చెప్పే ఆధారాలు మరింత బలపడ్డాయని చరిత్రకారుడు ఎం.ఆర్.రాఘవ వరియెర్ చెప్పారు.దీంతో కేరళ చరిత్ర లోహయుగానికి కంటే పురాతనమైనదని చెప్పడానికి ఆధారాలు లభించాయని చెప్పారు. కేరళ పురావస్తు శాఖ ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఎడక్కల్ గుహల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న హరప్పా, మొహంజదారో సంస్కృతికి సంబంధించి న చిహ్నాలు లభించాయి. లభించిన ఆధారాల్లో 429 చిహ్నాలను ఇప్పటికి గుర్తించారు. జాడీని పో లిన కప్పును పట్టుకున్న మనిషి బొమ్మ హర ప్పా సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇదేకాక క్రీస్తు పూర్వం 2300 నుంచి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం వర కూ విలసిల్లిన హరప్పా సంస్కృతి కి సంబంధించిన లిపి ఇక్కడ బ యటపడిందని, తవ్వకాలకు నా యకత్వం వహించిన వరియెర్ చెప్పారు.

పుట్టుక

సింధు లోయ నాగరికత ఎలా ఉధ్బవించిందో తెలిపేందుకు చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటగా దీనిని దక్షిణ ఆసియాను బాగా ప్రభావితం చేసిన, మరియు ఇండో యూరోపియన్ వలసల వల్ల ప్రభావితమైన వేదకాలపు నాగరికతలో మొదటి దశగా భావించారు. కానీ వేద కాలపు నాగరికతకు సంబంధించి ఎటువంటి విషయాలు కనుగొనలేకపోవడంతో దీన్ని శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. జంతువుల చిత్ర పటాల్లో వేదాల్లో ప్రముఖంగా ప్రస్తావించిన గుర్రాలు, రథాలు కనిపించకపోవడం మొదలైనవి ఇందులో ప్రధానంగా చెప్పబడినవి. ఎముకలపై చేసిన విస్తృత పరిశోధనల ఆధారంగా గుర్రాలు కేవలం క్రీ.పూ రెండవ సహస్రాబ్దిలోనే ప్రవేశపెట్టబడినవని ఋజువైంది. చివరగా సింధూ నాగరికతలో కనిపించే పట్టణ జీవితానికి, వేదాల్లో వర్ణించిన గ్రామీణ జీవితానికి ఎటువంటి పొంతన కుదరలేదు.
మరొక వివరణ "పూర్వ ద్రవిడ సిద్ధాంతం" (ప్రోటో-ద్రవిడియన్ సిద్ధాంతం) ద్రవిడ సంస్కృతిపై ఆధారపడి ఉంది.దీన్ని మొదటి సారిగా రష్యా, మరియు ఫిన్లాండ్ కు చెందిన పరిశోధకులు ప్రతిపాదించారు. వీరు ఈ నాగరికతకు సంబంధించిన చిహ్నాలు ద్రవిడ భాషల నుంచి రాబట్టవచ్చునని కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ద్రావిడ భాషలు అధికంగా దక్షిణ భారతదేశం మరియు శ్రీలంక ప్రాంతంలో ఉన్నాయి గాని కొద్ది భాషలు లేదా మాండలికాలు భారత దేశం ఇతర ప్రాంతాలలోను, పాకిస్తాన్‌లోను వినియోగంలో ఉన్నాయి. (బ్రహుయి భాష ద్రవిడ భాషా వర్గానికి చెందినది. దీనిని బెలూచిస్తాన్ ప్రాంతలో మాట్లాడుతారు.) కనుక ఈ వాదానికి కొంత బలం చేకూరుతున్నది. ఫిన్నిష్ ఇండాలజిస్ట్ ఆస్కో పర్పోలా అభిప్రాయంలో సింధు లోయ నాగరికతలో వాడిన లిపి అన్ని చోట్లా ఒకే విధంగా ఉంది కనుక ఆ నాగరికత వివిధ భాషల సమ్మేళనం అనడానికి కారణం కనుపించదు. కనుక ద్రావిడ భాషల పురాతన రూపం సింధులోయ జనుల భాష అయి ఉండవచ్చును. ఈ పూర్వ ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా ఇదమిత్థంగా ఆమోదించడానికి సరైన ఆధారాలు లభించడంలేదు. ఎందుకంటే పూర్వ ద్రవిడ సిద్ధాంతం ఏక భాషా సంపర్కంపైన ఆధారపడి ఉంది. మరే సాంస్కృతికమైన ఆధారాలు లభించలేదు.

ఆరంభ హరప్పా నాగరికత దశ

ఆరంభ హరప్పా-రావి దశ (రావి నది పేరు మీద) షుమారు క్రీ.పూ. 3300 నుండి క్రీ.పూ. 2800 వరకు సాగింది. పశ్చిమాన ఉన్న ఘగ్గర్-హక్రా నదీ ప్రాంతంలోని నాగరికత (హక్రా దశ) ఈ సమయంలోనే వర్ధిల్లింది. ఆ తరువాత క్రీ.పూ. 2800-2600 కాలం నాటి కోట్ డిజి దశ లేదా రెండవ హరప్పన్ నాగరికత దశ అంటారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో మోహంజొ దారో సమీపంలో కనుగొన్న శిధిలాల స్థలం పేరు మీద ఈ దశకు "కోట్ డిజి దశ" అనే పేరు వచ్చింది. మనకు లభించినవాటిలో అన్నింటికంటె పాతదైన సింధు లిపి షుమారు క్రీ.పూ. 3000 నాటికి చెందినది.
పరిణతి చెందిన హరప్పా నాగరికత అవశేషాలు పాకిస్తాన్‌లోని రహమాన్ ఢేరి మరియు ఆమ్రిల వద్ద లభించాయి. కోట్ డిజి (రెండవ హరప్పన్) లో లభించిన అవశేషాలు పరిణత హరప్పన్ నాగరికతకు నాందిలా అనిపిస్తున్నాయి. ఇక్కడ కనుగొన్న కోట (citadel) ఆనాటి అధికార కేంద్రీకరణను, నగర జీవనా వ్యవస్థను సూచిస్తాయి. ఈ దశకు చెందిన అవశేషాలు కనిపించిన మరొక పట్టణం భారత దేశంలో హక్రానది ప్రాంతంలోని కాలిబంగన్.[37]
ఈ నాగరికతలో వివిధ స్థలాల మధ్య వాణిజ్యం సాగింది. ఒకచోట లభించే వస్తువుల ముడి సరుకులు సుదూర ప్రాంతంలోని మరొక స్థలంలోంచి వచ్చినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు పూసల తయారికి అవుసరమైన లపీస్ లజులీ. ఈ దశలో గ్రామీణులు బఠాణి, నువ్వులు, ఖర్జూరం, ప్రత్తి వంటి పంటల వ్యవసాయాన్ని, గేదె వంటి జంతువుల పెంపకాన్ని సాధించారు. అంతకు ముందు చిన్న చిన్న గ్రామాలుగా ఉన్న జనావాసాలు క్రీ.పూ. 2600 నాటికి పెద్ద పట్టణాలుగా మారినట్లున్నాయి. "పరిణత హరప్పా నాగరికత దశ" ఇక్కడినుండి ఆరంభమైంది.

పరిణత హరప్పా నాగరికత దశ

ఆరంభం దశలో చిన్న చిన్న గ్రామాలలో విస్తరించిన ఈ సమాజం క్రీ.పూ. 2600 నాటికి నగరాలు కేంద్రాలుగా విస్తరించిన నాగరికతగా రూపు దిద్దుకొంది. ఈ నగరాలు సింధునది, దాని ఉపనదుల తీరాలలో అభివృద్ధి చెందాయి. ఇప్పటికి 1,052 నగర, జనావాస స్థలాలను గుర్తించారు. ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న హరప్పా, మోహంజొదారో మరియు ప్రస్తుత భారత దేశంలో ఉన్న లోథాల్ పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్న ఇలాంటి నగరాల అవశేషాలు.

నగరాలు

మొహంజొదారోలో లభించిన పరిణత హరప్పా నాగరికత దశకు చెందిన శిల్పం - "మతాధికారి రాజు" (Priest King) అని భావిస్తున్నారు. - కరాచీ నేషనల్ మ్యూజియమ్‌లో ఉన్నది.
సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. హరప్పా, మొహంజో-దారోల్లో, ఇటీవలే బయల్పడిన రాఖీగర్ ప్రాంతాల్లో పట్టణ రూపకల్పనను పరిశీలిస్తే ప్రపంచంలో మొట్టమొదటి పరిశుభ్రతా వ్యవస్థ ఇక్కడే ఆరంభమైనట్లు ఋజువౌతుంది. ఒక నగరంలో ఒక్కో ఇల్లు లేదా కొన్ని ఇళ్ళ సమూహం దగ్గర్లో ఉన్న ఒక బావి నుంచి నీళ్ళు పొందేవారు. స్నానాలకోసం కేటాయించబడినదనిపించే ఒక గదినుండి వాడిన నీరు డ్రైనేజి కాలువల గుండా బయటికి వెళితుంది. ఈ డ్రైనేజిలు మూసి ఉంచారు. అవి వీధులవెంట బయటకు వెళుతున్నాయి. ఇళ్ళ వాకిళ్ళు లోపలి నడవాలలోకి లేదా చిన్న సందులలోకి మాత్రమే అభిముఖంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలలో గృహ నిర్మాణం హరప్పా నిర్మాణాలను నాగరికతను పోలి ఉంది.
పురాతన సింధులోయ నాగరికతలో నిర్మించిన ఈ మురుగు నీరు, డ్రైనేజి వ్యవస్థ ఆ కాలంలో మధ్య ప్రాచ్యంలో గాని మరెక్కడైనా గాని నిర్మించిన డ్రైనేజి విధానాలకంటే చాలా అభివృద్ధి చెందినది. హరప్పా నాగరికతలో కొట్టవచ్చినట్లు కనిపించే అంశాలు - వారి నౌకాశ్రయాలు, ధాన్యాగారాలు, గోడౌనులు, ఇటుకల అరుగులు, దృఢమైన ఇటుకలతో నిర్మించిన బలమైన గోడలు. వారి కట్టడాలలో పెద్దపెద్ద గోడలు బహుశా వరదలనుండి, దాడులనుండి రక్షణకు ఉపయోగపడి ఉండవచ్చును.
ఈ నిర్మాణాలలో కేంద్ర స్థానంగా కనిపించే కోట లేదా ఉన్నత ప్రాసాదం(citadel) లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. సమ కాలీన నాగరికతలైన మెసపుటేమియా మరియు పురాతన ఈజిప్టులలో ఉన్నట్లుగా హరప్పా నాగరికతలలో పెద్ద పెద్ద నిర్మాణాలు ఏవీ కనిపించడం లేదు. రాజ భవనాలు, ఆలయ గోపురాలు, సైన్యాగారాలు, మతసంస్థలు వంటి పెద్ద పెద్ద కట్టడాలు హరప్పా నాగరికతలో కనిపించవు. ఉన్నవాటిలో పెద్ద కట్టడాలు ధాన్యాగారాలు అనిపిస్తున్నాయి. ఒక్కచోట మాత్రం పెద్ద నిర్మాణం పబ్లిక్ స్నానప్రదేశం అనిపిస్తున్నది. ఇక ఈ కోటలకు పెద్ద గోడలు ఉన్నాగాని అవి సైనిక ప్రయోజనాలకు ఉద్దేశించినట్లుగా కనిపించడంలేదు. ఒక వేళ అవి వరద ప్రవాహాలను నిరోధించడానికి కట్టినవి కావచ్చును.
నగరాలలో జనులు అధికంగా వాణిజ్యం లేదా చేతిపనులపై ఆధారపడినట్లు అనిపిస్తుంది. ఒక విధమైన వృత్తి అవలంబించేవారు ఒక స్థానంలో ఉండినట్లుంది. ముద్రికలు, పూసలు వంటి వస్తువుల తయారీకి వాడిన ముడిసరుకులు స్థానికంగా లభించేవి కాదు. సుదూర ప్రాంతాలనుండి దిగుమతి చేసుకొంటూ ఉండాలి. ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులలో ఆసక్తికరమైనవి కొన్ని - అందమైన, కొలిమిలో కాల్చిన ఫేయీన్స్ పూసలు - స్టియటైట్ ముద్రలు - ఈ ముద్రలపై జంతువుల, వ్యక్తుల (దేవతల?) బొమ్మలు, వ్రాతలు ఉన్నాయి. ఈ వ్రాత (సింధు లోయ నాగరికత లిపి)ని ఇంతవరకు చదవడం సాధ్యం కాలేదు. ఈ ముద్రికలు వాణిజ్య సామగ్రిపై ముద్రలు వేయడానికో, ఇతరాలకో వాడి ఉండవచ్చును.
కొద్ది ఇళ్ళు మిగిలిన ఇళ్ళకంటే కాస్త పెద్దవైనా గాని మొత్తానికి సింధులోయ నాగరికతలో ఇళ్ళు దాదాపు సమ స్థాయిలో ఉన్నాయనిపిస్తుంది. అన్ని ఇండ్లకూ సమంగా నీటిపారుదల వ్యవస్థ కలపబడి ఉంది. అప్పటి సమాజంలో సంపద విషయంలో వ్యత్యాసాలు అంతగా లేవనిపిస్తుంది. వ్యక్తులు ధరించే ఆభరణాలు మాత్రం సమాజంలో వారి స్థాయిని సూచిస్తూ ఉండవచ్చును.

సైన్సు

ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అయితే సింధు లోయ వివిధ ప్రాంతాలలో విధమైన కొలతలు ఉన్నట్లుగా ఇప్పటికి లభించిన ఆధారాలనుబట్టి అనుకోవచ్చును. లోథాల్‌లో దొరికిన దంతపు కొలబద్ద ప్రకారం వారు కొలిచిన అతి చిన్న కొలత షుమారు 1.704 మి.మీ. కు సరిపోతుంది. కంచు యుగంలో ఇంతకంటే చిన్న కొలమానం ఎక్కడా వాడలేదు. హరప్పా ఇంజినీర్లు తమ కొలతలకు దశాంశ విధానాన్ని వాడినట్లు తెలుస్తున్నది.
బరువులను కొలవడానికి వాడిన షడ్భుజాకారపు కొలమానాలు కూడా దశాంశ విధానాన్నే సూచిస్తున్నాయి. వారు వాడిన బరువులు ఖచ్చితంగా 4:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. 0.05, 0.1, 0.2, 0.5, 1, 2, 5, 10, 20, 50, 100, 200, మరియు 500 యూనిట్ల బరువు కొలమానాలు వాడారు. ఒక్కొక్క యూనిట్ షుమారు 28 గ్రాములు బరువుంది. తరువాతి కాలంలో (క్రీ.పూ. 4వ శతాబ్దం) కౌటిల్యునిఅర్ధశాస్త్రంలో చెప్పబడిన కొలమానాలు లోథాల్‌లో లభించిన కొలమానాలకు సరిపోతాయి.
హరప్పా కాలంలో కొన్ని ప్రత్యేకమైన పరికరాలు కనుగొన్నారు. ఉదాహరణకు కనుచూపుమేర కనబడే ప్రదేశాన్నిమరియు నీటి లాకు కొలవడానికి వుపయోగించే పరికరం. అంతే కాకుండా తమదైన కొన్ని లోహపు తయారీ ప్రక్రియల ద్వారా రాగి, కంచు, సీసం, తగరం వంటి లోహాలు తయారు చేశారు. హరప్పా ఇంజనీర్ల సాంకేతిక ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రపు ఆటుపోట్లను జాగ్రత్తగా అధ్యయనం చేసి నౌకాశ్రయాలను నిర్మించారు. అయితే లోథాల్ వద్ద "నౌకాశ్రయం" అనబడే నిర్మాణం లక్ష్యం ఏమిటో అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. బనావాలి వద్ద బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగపడే గీటురాయి బయల్పడింది.
2001లో పాకిస్తాన్ ప్రాంతంలో మెహ్రాఘర్ శిధిలాలలో లభించిన రెండు మానవ అవశేషాల పరిశీలన వలన హరప్పా నాగరికతలో ఆది దంతవైద్యానికి కి సంబంధించిన విజ్ఞానం ఉండేదని తెలుస్తున్నది. బ్రతికి ఉన్న మానవుల పండ్లలో డ్రిల్ చేయగలగడం అనే పరిజ్ఞానం క్రొత్త రాతియుగం నాగరికతలో ఈ ఒక్కచోటే కనిపిస్తున్నది. 9 మంది వ్యక్తుల (adults) పుర్రెలలో పండ్లపై రంధ్రాలు చేసి దానిపైమూతనుంచినట్లు ( drilled molar crowns) కనిపించాయి. ఈ అవశేషాలు 7,500-9,000 యేళ్ళ క్రితానివని అంచనా వేశారు.

కళలు మరియు సాంప్రదాయాలు

అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ మరియు మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. నాట్యం చేస్తున్న నర్తకుల వివిధ భంగిమల స్వర్ణ విగ్రహాలు, టెర్రాకోట ప్రతిమలు, శిలా విగ్రహాలు అప్పటి నృత్య శైలిని సూచిస్తున్నాయి. ఇంకా ఆవులు, ఎలుగుబంట్లు, వానరాలు, శునకాలు మొదలైన టెర్రాకోట బొమ్మలు కూడా లభించాయి. జాన్ మార్షల్ మొట్టమొదటి సారిగా మొహంజో-దారో లో నృత్య భంగిమలో నిల్చున్న ఒక నర్తకి ఇత్తడి విగ్రహాన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.
… ఈ విగ్రహాలను చూసినపుడు అవి చరిత్ర పూర్వ యుగానికి చెందినవని నేను నమ్మలేకపోయాను. ఈ బొమ్మల ద్వారా పురాతన కళ, సంస్కృతులకు సంబంధించి మనకున్న అభిప్రాయాలు పూర్తిగా తల్లక్రిందులవుతాయి. గ్రీకుల హెల్లెనిస్ట్ నాగరికత కాలం వరకూ ఇలాంటి విగ్రహాలు నమూనాలు ఎవరూ రూపొందించలేదని అంతకుముందు మనం అనుకొన్నాం. అందువల్ల ఎక్కడో ఏదో పొరపాటు జరిగి తరువాతి తరానికి చెందిన ఈ బొమ్మలు అంతకు ముందటి మూడువేల యేండ్ల క్రిందటి నాగరికతలో భాగంగా మనకు దొరికాయనుకొన్నాను.. .. ఈ బొమ్మలలో చూపిన శరీర సౌష్టవత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తరువాతి చాలా కాలానికి రూపొందిన గ్రీకు శిల్పకళనూ ఈ సింధులోయ తీరపు నాగరికులు ముందే ఊహించారా? .
నత్త గుల్లలపై నగిషీలు, పింగాణీ సామానులు, మెరుగులు దిద్దిన స్టీటైట్ పూసలు వంటి చాలా హస్తకళలు హరప్పా నాగరికత అన్ని దశలలోనూ, అనేక స్థలాలలో లభించాయి. వీటిలో కొన్ని పనులు ఇప్పటికీ భారత ఉపఖండంలో చేయబడుతున్నాయి. అప్పుడు దొరికిన కొన్ని అలంకరణ సామగ్రులు (దువ్వెనలాంటివి) యొక్క రూపాంతరాలు ప్రస్తుత భారతదేశంలో కూడా వాడకంలో ఉన్నాయి. క్రీ.పూ. 2800 - 2600 నాటి కొన్ని టెరాకొటా యువతుల బొమ్మలలో తల పాపిడిలో ఎరుపు రంగు గీతలు దిద్ది ఉన్నాయి. మొహంజొదారోలో లభించిన ముద్రికలలో కొన్నింటిపై పద్మాసనంలో ఉన్న బొమ్మ (పశుపతి?), తల్లక్రిందులుగా ఉన్న మనిషి బొమ్మ ఉన్నాయి. కొన్ని ముద్రలలో చిత్రించబడిన బూర లాంటి పరికరం, లోథాల్ లో లభించిన రెండు శంఖం లాంటి వస్తువులు అప్పట్లో వారు తంత్రీ వాద్యాలను వాడి ఉండవచ్చునని నిరూపిస్తున్నాయి. పాచికలలాంటి అనేక ఆట వస్తువులు, బొమ్మలు వారు వాడినట్లు తెలుస్తున్నది.

రవాణా మరియు వాణిజ్యం

ప్రాచీన లోథాల్ నగరపు నమూనా (చిత్రకారుడి ఊహాచిత్రం) (భారత పురావస్తు సర్వే శాఖ). 
వీరి ఆదాయం ఎక్కువగా వ్యాపారం మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. బాగా అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఇందుకు బాగా సహకరించేవి. ఇందులో ముఖ్యమైనవి ఎడ్లబండ్లు, పడవలు. ఇవి దక్షిణాసియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పడవలు చిన్నవిగా ఉండి చుక్కాని సహాయంతో నడిచేవి. వీటి అడుగు భాగం సమతలంగా ఉండేది. వీటిని పోలిన పడవలను ఇప్పటికీ సింధూ నదిలో గమనించవచ్చు ; కానీ సముద్రాలలో కూడా ఇటువంటి పడవలను నడిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. భారతదేశ పశ్చిమ ప్రాంతానికి చెందిన గుజరాత్ రాష్ట్రంలో లోథాల్ అనే తీర పట్టణంలో పడవలను నిలిపేందుకు ఏర్పాటు చేసిదిగా భావిస్తున్న ఒక పెద్ద కాలువను పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వ్యవసాయానికి ఉపయోగించబడిన విశాలమైన కాలువల సముదాయాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు.
క్రీ.పూ. 4300–3200 నాటి చాల్కోలితిక్ కాలం (రాగి యుగం)లో సింధులోయ నాగరికతలోని పింగాణీ పనులు దక్షిణ తుర్కమేనిస్తాన్ మరియు ఉత్తర ఇరాన్ పనిముట్లతో సారూప్యతను కలిగి ఉండడంవలన ఆ నాగరికతల మధ్య రాకపోకలు, వ్యాపార సంబంధాలు ఉండవచ్చుననే సూచనలు లభిస్తున్నాయి. క్రీ.పూ. 3200–2600 నాటి ఆరంభ దశ హరప్పా నాగరికతకు చెందిన ముద్రికలు, మట్టి పాత్రలు, బొమ్మలు, ఆభరణాలు లోని సారూప్యత కారణంగా వారికి మధ్య ఆసియా మరియు ఇరానియన్ పీఠభూమి ప్రాంతాలతో భూమార్గంలో రవాణా, వర్తక సంబంధాలున్నవని అనుకోవచ్చును. అనేక ప్రాంతాలలో లభించిన పనిముట్లు బట్టి వర్తక సంబంధాల ద్వారా మొత్తం సింధులోయ నాగరికత, ఆఫ్ఘనిస్తాన్‌లోని కొంత భాగం, పర్షియా తీర ప్రాంతం, ఉత్తర, పశ్చిమ భారత దేశం, మెసపొటేమియాల నాగరికతలను ఆర్ధికంగా ఏకీకృతం చేశాయనవచ్చును.
హరప్పా, మెసపుటేమియా నాగరికతల మధ్య విస్తారమైన సముద్రపు వర్తకం ఉండేదనీ, అది అధికంగా "దిల్మన్" (ప్రస్తుత బహ్రయిన్, పర్షియన్ సింధు శాఖ) ప్రాంతానికి చెందిన మధ్యవర్తుల ద్వారా సాగేదనీ తెలుస్తున్నది.దుంగలతో చేసిన తెప్పలపై అమర్చిన తెరచాప పడవల ద్వారా ఈ వర్తకం సాగేది. పాకిస్తాన్‌కు చెందిన అనేక సముద్రపు తీర రేవులు, గుజరాత్‌లోని లోథాల్ వంటి పెద్ద రేవులు ఈ వర్తకానికి కేంద్రాలుగా వర్ధిల్లాయి. సముద్రంలో నదులు కలిసే చోట ఏర్పడిన లోతు తక్కువ రేవులు ఇలాంటి వ్యాపారాలకు ముఖ్యమైన స్థలాలు.

వ్యవసాయం

1980వ దశకం తర్వాత జరిపిన కొన్ని పరిశోధనల ఆధారంగా సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది.వారు ఎక్కువగా పండించే ధాన్యం బార్లీలే. పురాతత్వ శాస్త్రజ్ఞుడు జిమ్ ష్రాఫర్ మెహ్రాఘర్ గురించి ప్రస్తావిస్తూ ఆహారోత్పత్తి దక్షిణాసియా లో దేశీయంగా ఆవిష్కరించబడిన అద్భుతంగా అభివర్ణించాడు. అప్పటి పట్టణ నాగరికతను, క్లిష్టమైన సామాజిక వ్యవస్థను దేశీయమైన సమాచారం సహాయంతోనే కాక వివిధ సంస్కృతుల ఆధారంగా అంచనా వేశారు. డొరియన్ ఫుల్లర్ లాంటి కొంతమంది మాత్రం మిడిల్ ఈస్ట్ కు చెందిన గోధుమలు దక్షిణాసియా దేశాల వాతావరణానికి అలవాటు పడడానికి సుమారు 2000 సంవత్సరాలు పట్టిఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపాడు.

సంకేత లిపి

ధోలవిరా ఉత్తర ద్వారం వద్ద కనుగొనబడిన పది గుర్తులు క్రీ.పూ 2000
400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన )పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి. సాధారణంగా ఈ శాసనాలు నాలుగు లేదా ఐదు అక్షరాలకు మించవు. వీటిలో చాలా అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి. ఒకే తలం మీద చెక్కిన శాసనాల్లో అన్నింటికన్నా పొడవైనది కేవలం ఒక అంగుళం (2.54 సెం.మీ) పొడవుండి 17 గుర్తులను కలిగి ఉంది. ఒకే ఘనం పై మూడు తలాల మీద చెక్కిన 26 గుర్తులుగల ఒక శాసనం, ఇప్పటిదాకా లభించిన కృతుల్లోకెల్లా అన్నింటికన్నా పొడవైనదిగా గుర్తించబడింది.
ఈ శాసనాల ఆధారంగా సింధూ సమాజం విద్యావంతమైనదిగా భావించినా, నవీన విద్యా విధానంలో వీటికి సమాంతరంగా ఎటువంటి వ్యవస్థా లేకపోవడంతో పలువురు భాషా శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని పాక్షికంగా ఆధారం చేసుకుని ఫార్మర్, స్ప్రోట్, విజెల్ రాసిన వివాదాస్పద పత్రం సింధూ లిపి భాషను సంకేతీకరించలేదనీ కేవలం ఇతర తూర్పు దేశాల సంకేత లిపిని మాత్రమే పోలి ఉన్నదని వాదించారు  . ఇంకా కొద్దిమంది ఈ గుర్తులను కేవలం ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించడానికి మాత్రమే వాడారని భావిస్తున్నారు. కానీ వీరు అదే గుర్తులు విస్తృతంగా వాడబడిన పూజ సామాగ్రిపై ఎందుకు ఉన్నాయన్న సంగతి మాత్రం వివరించలేక పోయారు. వేరే ఏ నాగరికతలోనూ ఇలా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయబడిన శాసనాలు లభించలేదు.
ఇప్పుడు వాడుకలోలేని కొన్ని పురాతన శాసనాల ఛాయాచిత్రాలను పర్పోలా మరియు అతని సహోద్యోగులు సంకలనంచేసిన అనే పుస్తకంలోప్రచురించబడ్డాయి. ఈ పుస్తకం చివరి భాగమైన మూడవ భాగంలో 1920, 1930 లో కనుగొనబడిన, తస్కరించబడిన కొన్ని వస్తువుల ఛాయాచిత్రాలను పొందుపరచగలరని భావిస్తున్నా దీని విడుదల కొన్ని ఏళ్ళ తరబడి ముద్రణకు నోచుకోకుండా ఉండిపోయింది.

మతం

ఇక్కడ చాలా వరకు దేవతా విగ్రహాలు కనపడడం వలన హరప్పా ప్రజలు ఫలవంతమైన భూమిని సూచించే అమ్మవారిని పూజించినట్లుగా భావించారు. కానీ ఎస్. క్లార్క్ అనే శాస్త్రజ్ఞుడు ఈ వాదనను వ్యతిరేకించాడు  కొన్ని సింధు లోయ ముద్రలు స్వస్తిక్ గుర్తు కలిగి ఉన్నాయి. ఈ గుర్తు దీని తర్వాత వచ్చిన కొన్ని మతాల్లో,పురాణాల్లో ముఖ్యంగా హిందూ మతంలో ఎక్కువగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ప్రాచీన హరప్పా సంస్కృతికి ముందు కూడా ఉన్నాయి. . శివలింగాన్ని పోలిన కొన్ని గుర్తులు కూడా హరప్పా శిథిలాల్లో కనిపించాయి.
వీరి చిహ్నాలు చాలా వరకు జంతువుల్ని కలిగి ఉండేవి. వీటిలో ముఖ్యమైనది పద్మాసనం లో కూర్చున్న ఒక బొమ్మ, మరియు దాని చుట్టూ ఉన్న వివిధ జంతువులు. శివుడి రూపమైన పశుపతి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. .
మొదట్లో హరప్పా ప్రజలు చనిపోయిన వారిని ఖననం (పూడ్చడం) చేసేవాళ్ళు. కానీ తరువాతి కాలంలో శవాల్ని దహనం చేసి ఆ బూడిదను పాత్రల్లో పోసి ఉంచేవారు. ఋగ్వేద కాలంలో కూడా చనిపోయినవారిని ఖననం లేదా దహనం చేసేవారు.

హరప్పా తదనంతరం

క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతపు పురాతత్వ సమాచారం ప్రకారం, హరప్పా తదనంతర సమాజం కనీసం క్రీ.పూ 1000-900 వరకూ కొనసాగి ఉండవచ్చునని చరిత్రకారుల భావన.  ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సంస్కృతులు ఒకదాని వెంబడి మరొకటి కొనసాగినట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు నొక్కి చెబుతున్నారు.
ఈ నాగరికత బలహీనపడటానికి ప్రధాన కారణం వాతావరణం మార్పే అయి ఉండవచ్చు. క్రీ.పూ 1800 వచ్చేసరికి సింధూ లోయ ప్రాంతం చల్లగానూ, తేమ రహితం కావడం ప్రారంభించింది. ఋతుపవనాలు బలహీనపడటం కూడా ఒక కారణం. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఘగ్గర్ హక్రా నదీ వ్యవస్థ అదృశ్యం కావడం. భూమి అంతర్భాగ నిర్మాణంలో జరిగిన కొన్ని మార్పుల మూలంగా ఈ వ్యవస్థ గంగా నదీ లోయ పరివాహక ప్రాంతానికి కదిలించబడి ఉండవచ్చు. కానీ ఇది ఎప్పుడు జరిగింది అన్నదానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఘగ్గర్-హక్రా నది పరివాహక ప్రాంతంలో జనావాసాలకు సంబంధించిన తేదీలు అందుబాటులో లేవు. ఇది కేవలం ఊహాగానమే ఐనా అన్ని నాగరికతలు వివిధ కారణాలవల్ల అంతరించిపోయాయన్నది వాస్తవం.హరప్పా నాగరికత అంతరించిపోవడానికి వాతావరణ మార్పులు కారణమా లేక నదీ వ్యవస్థలో మార్పులు కారణమా అని తెలుసుకోవడానికీ, ఈ ప్రాంతంలో 8000 సంవత్సరాల నుంచి నదీ వ్యవస్థ ఎలా మారుతూ వస్తుందో తెలుసుకోవడానికి అబెర్దీన్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ క్లిఫ్ట్ నేతృత్వంలో ఒక కొత్త పరిశోధన జరుగుతున్నది. 2004 లో విడుదలైన ఒక పరిశోధనా పత్రం ప్రకారం ఘగ్గర్ హక్రా కు చెందిన ఐసోటోపులు హిమానీ నదాలనుంచి వచ్చినవి కావనీ, వర్షం వల్ల ఏర్పడ్డవేనని పేర్కొన్నది.

వారసత్వం

సింధూ నాగరికత అంతరించిపోయిన తర్వాత దీనిచే ప్రభావితమైన అనేక ప్రాంతీయ నాగరికతలు పుట్టుకొచ్చాయి. హరప్పా శిథిలాలలో సమాధులు కూడా కనుగొనడం జరిగింది. ఈ విధంగా చనిపోయిన వారిని సమాధి చేయడం నేటికీ హిందూమతంలో కొనసాగుతూనే ఉంది. అలాగే రాజస్థాన్ లో కనిపించే కుండలపై చిత్రించే కళకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి.
source from wikipedia

Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున